సెంట్రల్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

కొండపల్లి బొమ్మలు, ఆంధ్రప్రదేశ్‌

మ్యూజియంలో ఇండియాతోబాటు నలుమూలల నుంచి సేకరించిన కళాకృతులున్నాయి. సాలార్‌జంగ్‌-3 మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ జంతు ప్రేమ, పర్యావరణ స్పృహ కల వ్యక్తి. ఈయన అరుదైన లోహం, మృణ్మయ, దారువు, దంతపు వస్తువులను సేకరించారు. ఇవే ఈ మ్యూజియం ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి.

పూర్వీకుల వలె వేట వ్యసనం లేకున్నా నవాబు అరణ్య ప్రాంతాలకు సంబంధించి అనేక వస్తువులను సేకరించాడు. మట్టి నమూనాలలో రైనాసరస్‌, హిప్పొపొటమస్‌, ఏనుగులను యూరప్‌, ఇండియా, చైనాల నుండి సేకరించాడు. గ్యాలరీలో కంచుతో చేసిన సింహాలు, పులులు, జింకలున్నాయి. 19వ శ||కి చెందిన మొసలిపై దాడి చేస్తున్న సింహం బొమ్మ ఉంది. ఇది జపాన్‌ దేశపుది. ఇలా అరణ్యజీవాల బొమ్మలెన్నో ఉన్నాయి.

నవాబులకు జంతువుల ఎడల ప్రేమ ఎక్కువ. ఆ కారణంగా పెంపుడు జంతువుల ప్రతిమలు కూడా మ్యూజియంలలో కొలువుదీరాయి. ఆయనకు కుక్కలు, పిల్లులు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ 20వ శ||కి చెందినవి. యూరప్‌ ప్రాంతాలనుండి సేకరించినవి. గ్యాలరీలో పర్షియన్‌, సయాం పిల్లులు, జపాన్‌ బుల్‌డాగులు, పగ్‌ల నమూనాలున్నాయి. ఇవన్నీ 20వ శ|| చెందినవి. ఆయనకు గుర్రాలు, పోలో పోనీలు చాలా ఇష్టం. జాతి గుర్రాల కంచు విగ్రహ నమూనాలు, నేల మీదున్న గుర్రాలు, కళ్ళాలున్న గుర్రాల ప్రతిమలు ఉన్నాయి.

ఇంతేకాక గ్యాలరీలో ఎన్నో లోహపు వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ 18, 19వ శ|| చెందినవి. పాకే జంతువుల నమూనాలు, గోధుమరంగు కుందేలు, పాము, చిలకల నమూనాలు కూడా ఉన్నాయి.